సింహబలుడు 1

Posted on

గౌతమీ నది తీరంలో ఉన్న ఒక పెద్ద సామ్రాజ్యం శాలివాహన సామ్రాజ్యం . శ్రీముఖ శాతవాహనుడు తన పదమూడవ ఏట ఉజ్జయినిరాజు విక్రమార్కుడిని ఓడించాడు.
భట్టి మహారాజు తో సహ ఉజ్జయిని మహారాజుని కొన్ని వందల సంవత్సరాల చరిత్రని రూపుమాపి కొంగ్రొత్త శాతవాహన శకాన్ని ప్రారంభించారు.
శ్రీముఖ శాలివాహనుడు అది విక్రమశకానికి చరమగీతం పలికాడు కానీ అంత పెద్ద సామ్రాట్టుని ఒక చిన్న దేశ యువకుడు ఎలా ఓడించాడన్నది ఎవ్వరికీ తెలియని రహస్యం .
ప్రస్తుతం గోదావరి నది పుట్టినిల్లయిన నాసిక త్రయంబకేశ్వరాన్ని అనుకొని శాతివాహన సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్నది శివస్వతి. తన సామ్రాజ్య స్థాపకుడైన శ్రీ ముఖుడు సముపార్జించిన విశేష సామ్రాజ్యం ఇప్పుడు దండయాత్రలతో హొరెత్తుతున్నది. నర్మదా నదికి ఉత్తరంగా ఉన్న విక్రమార్కుని వారసులు, నహపునితో కలగలసి తమ పూర్వ వైభవాన్ని పొందాలనుకుంటున్నారు.
యవనులు, మ్లేత్యులు, పల్లవులు మొదలైన వారు రాజ్యాన్ని దక్కించుకోవడానికి విఫల యత్నాలు చేస్తున్నారు.
శివస్వతికి వారసుడు లేడు, వారసులు లేని రాజ్యం మీదే శత్రువులు చూపు. రాజ్యాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని పన్నాగాలు పన్నుతున్నారు.
ఒకరోజు శివస్వతి గోదావరి తీరాన ఉన్న దట్టమైన అడవిలో వేటకు బయలుదేరాడు.
పులిని చూసి దాని మీదకు బాణం ఎక్కుపెట్టాడు.
ఇంతలో ఊహించని పరిణామం ఎదురైంది, గుర్రం మీద ఉన్న రాజుగారిని వెనుక నుంచి సింహం దాడి చేసింది.
రాజుగారు నేలమీద పడిపోయారు. కళ్ళు బైర్లు కమ్మాయి.వెంటనే ఒక వింత జరిగింది.
చెట్టు పైనుండి ఒక కుర్రాడు సింహం మీద దూకాడు. సింహాన్ని నిలువరించి దాన్ని మచ్చిక చేసుకుని, సింహం మీద ఎక్కాడు.
రాజుగారు తేరుకుని “బాలకా! నీవెవరవు.” అడిగారు.
“నేను ఈ అడవి పుత్రుడుని, నన్ను ఇక్కడ ఉన్న తెగ కు చెందిన వాడిని . మేము జంతువులతో కలిసిమెలిసి ఉంటాము.
” అని చెప్పాడు.
అప్పుడు రాజుగారు ఆ తెగ వారిని కలుసుకుని బాలుడు గురించి అడిగారు. అప్పుడు వాళ్ళు ఈ బాలుడు తమకు అడవిలో దొరికాడని చెప్పారు.
బాలుని చూసి రాజుగారు బాలకా! “నేను నిన్ను యువరాజుని చేస్తాను. నీవు నాతో మన రాజ్యానికి రావలసి ఉంటుంది” అని చెప్పారు.
ఆ తెగవాళ్ళు బాలుడిని ఒప్పించి, రాజుతో పాటు పంపించారు.
ఆ తరువాత ఆ కుర్రాడు రాజు గారితో సింహం ఎక్కి రాజ్యానికి బయలు దేరాడు. అలా ఆ కుర్రాడు సింహ౦ మీద రాజ్యలోనికి రావడంతో ప్రజలు ఒకింత ఆశ్చర్యానికి లోనయ్యి భయపడ్డారు.

మహారాణి పేరు గౌతమి . అందంగా ఉన్న బాలుని చూసి ముచ్చటేసింది రాణిగారికి బాలుని గురించి ఆరా తీసి,ఇతన్ని మనం పెంచుకుందాం అంది మహారాణి.అప్పుడు శివస్వతి బాలుని రాణికి చూపించి యువరాజుకి ఏమి పేరు పెట్టాలని ఆలోచించారు
“గౌతమీపుత్ర అని పెడదాము, బాలుని జన్మ వృత్తాంతం ఎవరికీ (తర్వాత తరాలకు) తెలియకుండా ఉండాలి. ఎలాగో గోదావరి నదీతీరాన దొరికాడు కాబట్టి గౌతమీపుత్ర అని పెడదాము” అని రాణి అన్నారు.
సింహాన్ని అధిరోహించాడు కాబట్టి శాతకర్ణి అని పేరు పెడదాము అని అన్నారు మహారాజు .
దత్తత కార్యక్రమము, నామకరణం అయిన తర్వాత అతడిని గౌతమ మహాముని ఆశ్రమానికి(గురుకులం) పంపించారు. గురుకులంలో అన్ని శాస్త్రాలను ఔపోసన పట్టిన శాతకర్ణి, ఏకసంధాగ్రహి. అన్నీ విద్యలను చక్కగా నేర్చుకున్నాడు.
జ్యోతిష్యులు యువరాజు జాతకం చూసి జంబూద్వీపాన్ని పాలించే చక్రవర్తి అవుతాడని చెప్పారు.
ఈ మాట దావానంలా వ్యాపించింది. అప్పుడు మహానందనం అనే ప్రాంతం నుండి సాధువులు రాజ్యానికి వచ్చారు. వారు శివస్వతికి నమస్కరించి ఇలా అన్నారు “రాజా, మీ ముత్తాత గారు శ్రీముఖ శాలివాహనుడు మాకు అత్యంత ఆప్తులు . మీకు ఒక రహస్యం చెప్పాలి .”
రెండవ భాగము ;
సాధువులు ఇలా అన్నారు.
మేము పరశురాముని ప్రియ భక్తులం. మేము పరశురాముడు సృష్టించిన కొడంగళూరు భగవతీ ఆలయంలోని గురుకులంలోని వాళ్ళము.
మీ ముత్తాత గారు మా దగ్గర ఒక రహస్య మర్మకళ నేర్చుకున్నారు.
ఆయన ఒక్క వేటుతో 15 మందిని చంపిన ఘనుడు.
మీకు ఒక తాళపత్ర గ్రంధం ఇస్తాము.
అది మీ కుమారునికి ఇచ్చి అందులో ఉన్న సూచనలు అనుసరించి మహానందనంలో ఉన్న గురుకులంలోనికి వెళ్ళమని చెప్పండి. అక్కడి నుండి అతనిని మహా చక్రవర్తిగా తయారు చేసేందుకు ఇంకొక మహాచక్రవర్తి దగ్గరకు ఆ గ్రంధమే తీసుకెళుతుంది.
తాను ఒంటరిగా ఈ కార్యక్రమము నిర్వర్తించవలిసి ఉంటుంది అని అన్నారు.
ఇదంతా విన్న మహారాజు పులకించి పోయారు ఈ మహాకార్యాన్ని ఎలాగైనా పూర్తి చేయాలని శాతకర్ణికి ఆ పవిత్ర గ్రంధాన్ని ఇచ్చారు.
శాతకర్ణి ఆ గ్రంధం తెరచి చూశారు. “అందులో పరశురాముని గురించి ఉంది. ఆయన ఆశ్రమం జంబూద్వీపానికి దక్షిణ కొనలో ఉన్నది.
దట్టమయిన కీకారణ్యంలో ఉన్నది.
దానికి దారి తెలియాలి అంటే ఇది తెలియాలి అని ఉంది
“సృష్టిమూలం అగ్గిరవ్వయితే పవిత్ర జలాన్ని కూడా ప్రమిదగా వెలిగిస్తుంది.ఆ దీపాన్ని మూడు కాంతుల నడుమ ఉంచితే మీ మార్గం ఉన్నత స్థానంలో ఉన్నవాడు చూపిస్తాడు.”
సృష్టిమూలం అంటే ఏమిటని ఆలోచించి శాతకర్ణి అనేక పుస్తకాలు చదివాడు.
ఒక రోజు ఏది ఏమైనా తండ్రికి తనపై ఉన్న నమ్మకాన్ని ఒమ్ము చేయకూడదని శాతకర్ణి అన్వేషణ మొదలు పెట్టారు.
అనేక సాధువులను కలిసి చర్చించారు. ఎంతకీ అవగతం అవ్వడం లేదు.”
అప్పుడు ఒక అందమైన లోయ వద్దకు వచ్చాడు శాతకర్ణి. అక్కడ ఒక అందమైన కన్యను చూసి వింతగా అనిపించింది. ఇంత అందమైన సౌందర్య రాశిని ఎప్పుడూ చూడలేదు. అతను వెంటనే ఆమెను వెంబడించాడు. ఆమెను రహస్యముగా ఆమె పరివారం వద్దకు వెళ్ళి చూశాడు.

ఆ కన్య పరివారం ఒక అందమైన తటాకం (చెరువు) వద్ద ఉంది.బహు నున్నగా చెక్కిన రాళ్లతో తటాకమునకు చుట్టూ గోడ కట్టబడి ఉన్నది. చెరువు లోకి మెట్లు మరియు తూరలు కట్టిన పనితనం చూసి శాతకర్ణి విస్తుపోయాడు .శతధృవంశ యోధుల్లా ఉన్న పెద్ద వృక్షాలు ,దట్టమైన నీడ తో పాటు పిల్ల గాలులు కూడా వీస్తుండండం తో మైమరచి ,పిల్ల కోసం వెతకసాగాడు .కానీ నీటి లో పిల్ల తిమ్మెరలు చూసి ఏమి ఈ సౌందర్యం అనుకున్నాడు. ఇంతలో ఒక పెద్ద ఉడత ఒక చెట్టు మీదనుంచి ఇంకొక చెట్టు మీదకు ఉరుకులు పరుగులు చూసాడు. చెట్టు మీద రెండు కోతులు కూర్చొని ఉన్నాయి ,వాటి తోకలతో పిల్లకోతి ఉయ్యాలలూగుతోంది.

నేల మీద పచ్చిక మృదువుగా కాళ్లకు తగులుతోంది. తుమ్మెదలు, తేనెటీగల ఝుంకారాల మధ్య పెద్ద పళ్లెం లాగా ఉన్న ఆకులతో ఉన్న ఎర్ర కలువలు మరింత వికసిస్తున్నాయి. పక్షుల కిలకిలారావాలు విని చెరువు లో ఉన్న ఒక దిబ్బ మీద ఒక దృశ్య కావ్యం చూసాడు శాతకర్ణి. చెరువులో దిబ్బ మీద ఎర్ర చిలువ బాతులు ,నారాయణ పక్షులు, నీటి కోడిల గుంపు చూసి విహంగ జంటల ప్రేమకేళి చూసి మళ్ళి సుందరాంగి గుర్తుకు వచ్చింది.

అలా వెళ్లగా ఒక శివాలయం కనపడింది .అక్కడ ఆ దివ్యంగన చెలికత్తెలతో కూడి దేవునికి హారతి అర్పించి ,చెరువు లోకి దిగింది. చెలికత్తెలు ఇక్కడ మొసళ్ళు ఉండవు కదా అని పరిహాసమాడారు. ఇంతలో స్నానం ముగించి దివ్యంగన మహాదేవునికి పూజాదికాలు చేసింది. కానీ శాతకర్ణికి ఆమె మోము (ముఖం) అగుపించుట లేదు. వేరే వైపుకు వెళ్లి చూద్దామని బయలుదేరాడు, పూజ ముగించుకొని ఆమె కూడా శాతకర్ణి వైపు వచ్చింది. ఇద్దరు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. దెబ్బతో ఇంతకూ ముందు చూసిన ప్రకృతి సౌందర్యం అంతా మనస్సులోంచి మటుమాయం అయిపోయింది .ఆమెను చూస్తూ స్థాణువు ల ఉండి పోయాడు .
ఇంతలో భటులు వచ్చి శాతకర్ణి ని చుట్టుముట్టారు.ఆమె శాతకర్ణి అందము చూసి ముగ్ధురాలై సరస్సు లోనుండి ఒక కలువను తెంపి పంటితో కొరికి తన యద మీద కలువను పెట్టి శాతకర్ణి మీదకు విసిరి చెలికత్తెలతో పారిపోయింది. వారు చాల దూరం వెళ్లిన తరువాత శాతకర్ణి ని భటులు యువరాణిని చూసినందుకు ఒక చెట్టుకు కట్టేసి అడవి లో ఒంటరిగా వదిలేసారు.ఆ దివ్యంగన మత్తు లో ఉన్న శాతకర్ణి ఆమె రూపాన్ని స్ఫురణకు తెచ్చుకున్నాడు. ఇంతలో ఇందాక ఉయ్యాల ఊగుతున్న కోతిపిల్ల శాతకర్ణి కట్లు విప్పేసి కేరింతలు కొడుతూ వెళ్ళిపోయింది. అప్పుడు శాతకర్ణి అనుకున్నాడు “ఆమె గంధర్వురాలై ఉంటుందా,లేక మత్స్యకన్యా ? లేక నాగకన్యా ?. ఏమి సౌందర్యo ! ….పూర్ణచంద్రుడు లాగా పరిపూర్ణంగా ,జాలువారుతున్న కురులు తేనెటీగల సమూహంలా,నెలవంకను పోలిన వికసించిన పెదవుల సమాహారం, సివంగిని గుర్తుకు తెచ్చే ఆ నడుము, ఆ వయ్యారాల హంస నడక, శ్వేతాంబరాల వంటి మేనిఛాయ ,కస్తూరి సువాసనలతో ,మల్లెపువ్వు లాగా ,కోకిల కంఠం తో ,మన్మధుడే దిమ్మతిరిగేలా వెల్లువిరిసిన వసంతం లాగా ఉంది ఆ దివ్యంగన.”
ఆమె మైకంలో పడి శాతకర్ణి ఆమె గురించే తలచుకుని మురిసిపోయి, కొన్ని రోజులకి ఎలాగైనా ఆమెను పొందాలని చాలా ప్రాంతాలు వెదికాడు.
ఆమె దొరకలేదు వైరాగ్యంతో కృంగిపోయాడు.
అప్పుడు యువరాజు ఒక కొండ వద్దకు వచ్చి అక్కడ శివాలయంలో తలదాచుకున్నాడు.
అక్కడ శివమహాపురాణం చెబుతున్నారు పండితులవారు.
“ఈ అనంతవిశ్వం ఒక నల్లరాయిలా ఏర్పడింది. విశ్వశక్తి అంతా శివుని రూపంలో వచ్చింది. శివుని నుంచి ఆదిశక్తి, బ్రహ్మ వచ్చారు. బ్రహ్మ సప్త ఋషులను సృష్టించారు. బ్రహ్మ సృష్టికర్త అయ్యి సంధ్యను సృష్టించారు. బ్రహ్మ మానసపుత్రుడు మన్మధుడు. మన్మధుని కారణాన కామం పెరిగిపోయింది. ఆ కామం పరమశివుని మీద అస్త్రం ఎక్కుపెట్టినప్పుడు మన్మధుడు బూడిద అయిపోయాడు.
అప్పుడు మన్మధుడి ప్రభావం వల్ల బ్రహ్మ కామం తో తనను ఆమెను చూడటం వల్ల తట్టుకోలేక సంధ్య కూడా అగ్నిప్రవేశం చేసి ప్రాతః సంధ్య శ్యామ సంధ్యగా మారిపోయింది.
అలా తన తేజస్సుని మార్గశిర మాసంలో అగ్నిగా మార్చి ఈ అరుణాచలం పై వెలిశారు మహాశివుడు “అని చెప్పాడు.
అప్పుడు ఆలోచన వచ్చింది, శాతకర్ణికి.
గ్రంథం లో మొదటి వాక్యం, సృష్టిమూలం అగ్గిరవ్వ అయితే అంటే ఈ అరుణాచలంలో ఆ అగ్ని నాకు దొరుకుతుంది.,అని ఈ అరుణాచలానికి ఎలా వెళ్ళాలి అని ఆలోచించాడు.
అరుణాచలం కొండ క్రిందకు వచ్చి శాతకర్ణి అంతా వెదికాడు ఏమైనా దారి దొరుకుతుందేమోనని.
అంతా దట్టమైన అడవి, యువరాణిని ఇంకా మరిచిపోలేకుండా ఉన్నాడు శాతకర్ణి.
అప్పుడు ఒక శివాలయం కనిపించింది. అందులోని పూజారి పేరు దక్షిణామూర్తి, దక్షిణామూర్తికి జరిగిన సంగతి అంతా చెప్పి తనకు దారి చూపించమన్నాడు శాతకర్ణి అప్పుడు పూజారి “నాయనా ఇది శివుడు తన ఆత్మశక్తి జ్వాలగా మార్చి వెలసిన ప్రదేశం. బ్రహ్మ కుమారులు (సనక, సనాతన, సనందన, సనత్ కుమారులు )నలుగురూ అన్ని శాస్త్రాలను ఔపాసన పట్టినా ఏదో తెలియని తనం వెంటాడుతూ ఉండేది.
అప్పుడు జ్ఞానం సంపాదించుకోవడానికి పరమేశ్వరుని వద్దకు వచ్చి జ్ఞానం ఉపదేశించమని చెప్పారు.
ప్రకాశవంతం

శివుల వారు దక్షిణామూర్తిగా మారి ఒక భోధి వృక్షం దగ్గర ఉపదేశం చేశారు.
ఆ ఉపదేశం సారాంశం ఏమిటంటే నిన్ను నువ్వు తెలుసుకోవాలని.నిన్ను నువ్వు తెలుసుకోవాలంటే తురియ స్థితికి చేరాలి, అది సమాధి స్థితికి ముందు స్థితి.ఆ భోధి వృక్షం ఇక్కడే ఉంది.ఆ స్థితి పొందడానికి నీకు నేను సాయం చేస్తాను “అన్నారు.
ఇది కార్తీక మాసం, కార్తీక మాసం 21వ రోజున శివుని శక్తి సంపూర్ణంగా వెలుగు రూపంలో కనపడుతుంది. ఆ శక్తికి మూలం ఎక్కడో ఎవరికీ తెలియదు. నువ్వు తెలుసుకుంటే నీటిలో దీపం వెలిగించే అగ్గి రవ్వ దొరుకుతుంది అని అన్నారు.
తురియ స్థితి పొందడానికి శాతకర్ణి శతవిధాలా ప్రయత్నిస్తున్నాడు.
21వ రోజు రానే వచ్చింది.
శివునికి వెలుగుకి సంబంధమైనది ఏది అని ఆలోచించి చంద్రవంక శివుని తలపై ఉండడాన్ని చూసి, ఆలోచించాడు. చంద్రుని కిరణాలు ప్రకాశవంతంగా కొండపైన ఒక చోట పడుతున్నాయి. వాటిని చూసి ఆ ప్రదేశానికి వెళ్ళాడు. కొండపైన ఒక ద్వారం తెరుచుకుంది.
కొండలోనికి ఒక దారి ఉన్నది. నాలుగు ద్వారాలు కొండ సొరంగంలోనికి ఉన్నాయి.
వాటిని చూశాడు శాతకర్ణి.
మొదటి ద్వారం దగ్గరకు వెళ్ళాలి అంటే నీళ్ళు లోతుగా ఉన్నాయి. ప్రక్కనే బోలెడు అస్థి పంజారాలు ఉన్నాయి ,ఒక పడవ ఉంది ,కర్రతో పడవ నడుపుకుంటూ మొదటి ద్వారం వద్దకు వెళ్ళాడు. ద్వారం బయట ,పెద్ద తాళం వేళాడదీసి వుంది.కానీ ద్వారానికి తాళం కప్ప కనబడలేదు ద్వారం రాయితో చేయబడింది. కాగడా వెలుతురులో చూస్తే ద్వారం ప్రక్కగా రాయితో చేసిన కప్ప ఉంది.రెండు రాళ్ళ తలుపుల మధ్య తాళం కప్ప ఉంది మధ్యలో చేయి వెళ్ళటం లేదు. ఆ రెండు గోడల సందులో చెయ్యి ఎంత వంచినా వెళ్లట్లేదు.పడవలో శాతకర్ణి తురియ సాధన చేశారు. ఒక ఆలోచన వచ్చింది.చేతిని మోచేయి వద్ద విరిచాడు, అలా చేయడం వల్ల ఎంతో బాధకు లోనయ్యాడు. ఇంకో చేతితో విరిగిన చేతిని పట్టుకుని, ఆ సందులో చేతిని దూర్చి తాళం తిప్పగలిగాడు.విపరీతమైన బాధతో ఉన్నాడు శాతకర్ణి. వెంటనే తలుపు తెరుచుకుంది ,వెంటనే మెడలో గుడ్డ వదులుగా కట్టి అందులో విరిగిన చేతిని పెట్టాడు. ఒక చేతితోనే తెడ్డు పట్టుకొని పడవ నడిపాడు. రెండో ద్వారం సమీపించేటప్పటికి నీటిలో అలలు బయలు దేరాయి ,ఎదురుగా సుడిగుండం ఉంది.దాని తప్పించుకోబోయి పడవ తిరగబడిపోయింది.ప్రక్కనే ఉన్న తీగను పట్టుకోబోయాడు .అది నీటి సర్పం ,నాలుక మీద కాటు వేసింది. నాలుక పెద్దగా వాచిపోయి ఊపిరి ఆడటంలేదు .వెంటనే శాతకర్ణి ,సాధన చేసి కత్తితో గొంతు మీద గాటు పెట్టాడు .గాలి ఆడింది .వెంటనే తూడు పువ్వు రెమ్మను కత్తిరించాడు .అది గొట్టంలా ఉంది. దానిని గొంతులో పెట్టాడు .గాలి ఆడుతూ ఉంది వెంటనే పెద్ద పళ్లెం లాంటి ఆకులు నీటిపై తేలియాడుతున్నాయి . ఓపిక తెచ్చుకుని శాతకర్ణి వాటి పై పడుకున్నాడు .
కళ్ళు తెరిచేసరికి ఎదురుగా దక్షిణామూర్తి పూజారి ఉన్నారు. కాంతి మీద పడి వంటిపై ,చేయిపై గాయాలు మానిపోయాయి. అప్పుడు దక్షణామూర్తి,చెబుతూ, “ నాయనా నీకు రెండు పరీక్షలు పెట్టాను.
మొదటిది నొప్పి మీద భయం పోగొట్టేది .రెండవది ప్రాణం మీద మమకారం పోగొట్టేది చావు దగ్గరికి వెళ్ళి వచ్చిన వాడు చావు గురుంచి భయపడడు.
సాలిగ్రామ నిర్మితమైన అరుణాచల స్వామి ఆలయానికి స్వాగతం.” .ఇంకొక ద్వారం మిగిలింది, ఆ ద్వారం తర్వాత నీకు అరుణాచల స్వామి కటాక్షం కలుగుతుంది “అన్నారు.
అక్కడకు వెళుతుంటే అక్కడ కొలను లో యువరాణి కొలనులో స్నానం చేస్తున్నది. పున్నమి వెలుతురు లో ఆమె మేని ధవళకాంతులీనుతుంది .ఇంకా చెలికత్తెలు కూడా స్నానం చేయుచు యువతులను చూసిన శాతకర్ణి వారి వద్దకు వెళ్ళాడు.అందరూ వివస్త్రలు గా ఉన్నారు. వారి కాళ్ళు నున్నగా పాదరసం వలె నీటి లో కదలాడుచున్నవి . వారిని చూసి బయటకు రండి మీ వెనుక మొసలి ఉన్నది అని చెప్పాడు. అప్పుడు ఆ అందమైన యువరాణి తన నగ్న శరీరం తో శాతకర్ణి వద్దకు వచ్చినది.
నీటి తో తడిసిన ఆమె శరీరం బంగారు వర్ణం లో మెరిసి పోతూ ఆమె అందాలు రెట్టింపయ్యాయి . అతనిని చూసి నవ్వుతూ స్పందన లేకపోవుట గమనించి ,నవ్వి అతని ఇంద్రియ నిగ్రహము నకు కారణం ఇతను తురీయా స్థితి సాధించటం అని చెప్పి వెళ్ళిపోయింది. అప్పుడు వెనుక నుండి దక్షిణామూర్తి “భళా శాతకర్ణి ,నీవు ఇంద్రియాలను జయించావు తురియ స్థితిని నీవు సాధించావు ,శుక మహర్షి మాత్రమే ఈ స్థితిని పొందగలిగారు .వ్యాసునికి కూడా దక్కని స్థితి నీకు కలిగింది.” అంతలో ద్వారం తెరుచుకుంది.
నాలుగు చిరుత పులులు వచ్చి శాతకర్ణి పై పడ్డాయి .ఎదురుగా కత్తి ఉన్నది.కత్తి పట్టుకుని కోపంతో ఉన్న చిరుత పులులు పైకి ఎగిరాడు. శాతకర్ణి ,జంతువులు తన బాల్య మిత్రులు గనుక వాటి మదం అణిచి ఒక చిరుత మీద స్వారీ చేశాడు .
అప్పుడు దక్షిణామూర్తి చూసి భళా “ చేతిలో కత్తి ఉన్న వాటిని చంపకుండా జీవకారుణ్యం చూపించావు” అని అన్నారు.
అప్పుడు దక్షిణామూర్తి ఆఖరి తలుపు తీసి స్పటిక లింగాన్ని చూపించి .అప్పుడు అడిగాడు, దక్షణామూర్తి, శివలింగం అంటే ఏమిటి అని .
వెలుగులు జిమ్ముతున్న ఆ శివలింగం అంతా ప్రకాశంగా ఉంది.అప్పుడు శివలింగాన్ని చూసి ధ్యానం చేసి శాతకర్ణి ఆ శివలింగం మానవుని శుఘమ్న నాడి కి చిహ్నం అని చెప్పాడు.
అప్పుడు శాతకర్ణి తీక్షణంగా శివలింగాన్ని గమనించాడు. రెండు కెంపులతో శివలింగానికి రెండు కళ్ళు ఉన్నాయి.శివునికి మూడో కన్ను కూడా ఉంటుంది అని ఆలోచించుకొని చూసాడు .రెండు రెండు కన్నుల మధ్య గంధం రాసి ఉంది,అది తొలగించాడు శాతకర్ణి. శాతకర్ణి అప్పుడు మూడో కన్ను బంగారు రేకుతో చేయబడిన ఆ కన్నును ప్రక్కకు జరిపాడు రేకు తీయగానే ఎంతో ప్రకాశంతో వెలుగుతున్న సోమ వజ్రాన్ని చూసాడు.
ఆ వజ్రాన్ని తీసుకుని ఇదే అరుణాచలంలో వెలుగు అనుకోని ముందుకు వెళ్ళాడు . దక్షిణామూర్తి దగ్గరకు అంతలో ఒక సంఘటన జరిగింది. ఒక త్రిశూలం వచ్చి దక్షిణామూర్తికి తగిలింది .రక్తం ధారగా కారిపోతుంది .అప్పుడు శాతకర్ణి ఆలోచించి నాకు గొంతుకు ,చేతికి ఉన్న గాయాన్ని ఈ కాంతి నయం చేసింది.ఇప్పుడు మీ గాయాన్ని ఈ కాంతి రూపుమాపుతుంది అన్నాడు.
కానీ దక్షిణామూర్తి చెప్పాడు ,నీవు కారణజన్ముడివి ,కాబోయే చక్రవర్తివి,ఈ వజ్రాన్ని తీసుకు వెళ్ళు ఇంకొన్ని క్షణాల్లో కార్తీకమాసం 22వరోజు వస్తుంది .అప్పుడు ఈ కాంతి వెళ్లిపోతుంది .
అప్పుడు శాతకర్ణి ఒక మనిషి ప్రాణం కన్నా ఇదేమి ముఖ్యం కాదని తలచి ఆ కాంతిని దక్షిణామూర్తి గాయంపై ప్రసరింపచేశాడు .సోమ వజ్రం వెలుగు పోయింది వెంటనే దక్షిణామూర్తి గాయం నయం అయ్యింది . దక్షిణామూర్తి మామూలు మనిషి అయ్యాడు .
అప్పుడు దక్షిణామూర్తి చెప్పాడు .శివుని యొక్క ఆత్మశక్తి ఈ అరుణాచలాన్ని తేజోమయం చేస్తుంది ,కానీ ఈ స్థలం నిన్ను నువ్వు తెలుసుకొనేలా చేస్తుంది .ఆత్మ సాక్షాత్కారం కలుగ చేసే పుణ్యభూమి .నీవు ఈ స్థితిని సాదించావు. నీకు కావలిసిన వెలుగు నీలోనే ఉంది .నీవే చూడు నీకే కనిపిస్తుంది.అన్నాడు.
వెంటనే శాతకర్ణి శరీరంలోనుంచి వెలుగు(ఆత్మశక్తి ) వజ్రం లోకి వచ్చింది అప్పుడు దక్షిణామూర్తి ని, ధైర్యసాహసాలు అన్నీ నిరూపించుకున్నావు. బుద్ది బలం ,యోగ బలం నిరూపితమైనది.
అప్పుడు దక్షిణామూర్తి “నీ ధైర్యసాహసాలు అన్నీ నిరూపించుకున్నావు. బుద్ధిబలం, యోగబలం నిరూపితమైనది.
నీవు తక్షణం ఋష్యముఖి పర్వతం వద్దకు వెళ్ళు అక్కడ మీ ముత్తాత శాలివాహనుడు గురించి నీకు తెలుస్తుంది.”
దీపాన్ని నీళ్ళతో వెలిగించడం అనేది ఆ పర్వతపు నీటితోనే సాధ్యం అవుతుంది “అని చెప్పాడు.
శాతకర్ణి తన గుర్రం మీద ఎక్కి సోమవజ్రాన్ని సంచిలో పెట్టుకుని కిష్కింద రాజ్యానికి బయలుదేరాడు.
ఋష్యముఖి పర్వతం కిష్కింధ రాజ్యం వద్ద ఉన్నది.

686414cookie-checkసింహబలుడు 1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *